ముంబై: సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలకు వ్యతిరేకంగా అవిరామంగా నిరసన దీక్ష చేస్తానని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే హెచ్చరించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్నా హజారే తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై ఇటీవల మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దురదృష్టకరమని విమర్శించారు. ప్రజలతో మద్యం మాన్పించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం, వారిని మద్యానికి బానిసలుగా చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తనకు ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం గత నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ మార్కెట్లు, పెద్ద స్టోర్లలో వైన్ అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దేవాలయాలు, విద్యా సంస్థల వద్ద ఉండే వాటికి ఇది వర్తించదని తెలిపింది. మరోవైపు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. మహారాష్ట్రలోని ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వంపై మండిపడింది. మహారాష్ట్రను మద్యపాన రాష్ట్రంగా మారుస్తున్నారంటూ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు.