చెన్నై, సెప్టెంబర్ 3: వొడాఫోన్ యాడ్లోని పగ్ (ఒక రకమైన బుజ్జి శునకం)లా భర్త వెంట భార్య అనుసరించాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తి ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎప్పుడూ తన భార్యను వెంట తీసుకుని వెళ్లలేకపోవచ్చు అని.. భార్యాభర్తల వైవాహిక వివాదానికి సంబంధించిన ఒక కేసు విచారణలో డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జీఆర్ స్వామినాథన్, ఎండీ సుమతీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
‘వేరే నగరంలో పనిచేయడానికి వెళ్తూ భార్యను తీసుకువెళ్లకపోవడం వైవాహిక బాధ్యతలు ఉల్లంఘించడమే’ అంటూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది. ‘అన్ని సమయాల్లో భార్యను భర్త తాను పనిచేస్తున్న ఊరికి తీసుకెళ్లలేక పోవచ్చు. ఉదాహరణకు భర్త ఒక సైనికుడు అయితే అతను తన కాపురాన్ని ఆర్మీ బ్యారక్లలో పెట్టలేడు కదా. ఒక వేళ భార్య ఉద్యోగం చేస్తున్నట్టయితే వొడాఫోన్ యాడ్లోని పగ్ డాగ్లా భర్తను అనుసరిస్తూ వెళ్లాలని ఆశించరాదు’ అని పేర్కొంది.
భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను కొట్టివేస్తూ శివగంగ న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి ఉద్యోగ బాధ్యతల నిమిత్తం శివగంగ నుంచి ముంబైకు బదిలీపై వెళ్లాడు. అయితే భార్యను శివగంగలోనే ఉంచాడు. అయితే తాను లేనప్పుడు తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, తనకు విడాకులు మంజూరు చేయాలని శివగంగలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కాగా, ఈ పిటిషన్ విచారణ సమయానికి భర్తకు 67 ఏండ్లు కాగా, వారికి నలుగురు పిల్లలున్నారు. భార్యాభర్తలిద్దరూ 16 ఏండ్ల నుంచి విడివిడిగా ఉంటున్నారు.