మల్కాన్గిరి: వారిద్దరికి ఏడాది క్రితం పెండ్లయింది. భార్యపై ప్రేమతో ఓ ఖరీదైన ఫోన్ను కొన్న భర్త.. దానిని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే దానిని ఈఎంఐలో కొన్నాడని తెలుసుకున్న ఆమె.. భర్త సమక్షంలోనే బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఒడిశాలోని మల్కాన్గిరి (Malkangiri) జిల్లాలో చోటుచేసుకున్నది.
జ్యోతి మండల్, కన్హై భార్యాభర్తలు. వీరిద్దరు ఏడాదిక్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరు మల్కాన్గిరి జిల్లాలోని ఎంపీవీ 14 గ్రామంలో నివాసముంటున్నారు. సరదాగా సాగుతున్న కొత్తకాపురంలో ఫోను చిచ్చుపెట్టింది. కన్హై.. ఓ ఖరీదైన ఫోన్ను జ్యోతికి గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లిండం వీలుకాకపోవడంతో ఈఎంఐ రూపంలో నెలవారీగా చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఈఎంఐ కాస్తా ముసింది. దీంతో ఫైనాన్స్ కంపెనీకి చెందిన అధికారులు కన్హై సంతకం కోసం వారింటికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆమె మనస్థాపానికి గురైంది. తనకు ఈఎంఐలో కొన్న ఫోన్ను బహుమతిగా ఇవ్వడం పట్ల నొచ్చుకున్నది.
భర్తతో గొడవకు దిగింది. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన జ్యోతి.. తన భర్త ముందే పురుగుల మందు తాగింది. దీంతో షాక్ గురైన కన్హై స్పృహతప్పిపడిపోయాడు. స్థానికులు ఇద్దరిని దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమిండంతో జ్యోతి మరణించింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదుకానప్పటికీ.. పోలీసులు సుమోటోగా దర్యాప్తు ప్రారంభించారు.