బెంగళూరు: ప్రత్యేక ఇల్లు కావాలని భార్య కోరడం, తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడం క్రూరత్వం కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈ కారణాలతో భర్తకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను రద్దు చేసింది. ఒక భర్త విడాకుల కోసం 2002లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తమ పెండ్లి అనంతరం భార్య ప్రత్యేక ఇల్లు కావాలని డిమాండ్ చేస్తున్నదని ఆరోపించాడు. వితంతువైన తల్లి, తమ్ముడి ఆలనా పాలనా చూసుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని, అందుకే ఆమె కోరికను తిరస్కరించినట్లు తెలిపాడు.
అలాగే తన తల్లితో భార్య గొడవపడి ఎవరితో చెప్పకుండానే పుట్టింటికి, సోదరి ఇంటికి వెళ్తుందని భర్త ఆరోపించాడు. తన భార్య ప్రవర్తన వల్ల తాను నరకయాతన అనుభవిస్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నాడు. 2007లో తన పిల్నాడ్ని తీసుకొన్ని వెళ్లిన భార్య ఇంటికి తిరిగి రాలేదని ఆరోపించాడు. భార్య క్రూరత్వాన్ని భరించలేకపోతున్నానని, తమ వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును కోరాడు. దీంతో ఆ కోర్టు ఆయనకు విడాకులు మంజూరు చేసింది.
అయితే ఈ విడాకులను భార్య హైకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టితో కూడిన ధర్మాసనం ఆమె పిటిషన్పై విచారణ జరిపింది. ప్రత్యేక ఇల్లు కావాలని భార్య కోరడం, తన తల్లిదండ్రులు లేదా సోదరి ఇంటికి వెళ్లడం క్రూరత్వం కాదని తెలిపింది. ఈ కారణాలతో విడాకులు కోరడం సరికాదని పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకుల డిక్రీని రద్దు చేసింది.
మరోవైపు ఆ మహిళ తన భర్త, ఆయన కుటుంబంపై వరకట్నంతోపాటు గృహహింస కింద కేసు పెట్టింది. అయితే వారు దోషులుగా నిరూపణ కాలేదు.