Supreme Court | అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పోస్టర్లలో ఎక్కడా శరద్ పవార్ పేరుతో పాటు ఫొటోలను ఎందుకు వినియోగిస్తున్నారంటూ ప్రశ్నించింది. ఎన్సీపీ రెండువర్గాలుగా వీడి.. శరద్ పవార్పై అజిత్ పవార్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల కమిషన్ పార్టీ పేరుతో పాటు ఎన్నికల గుర్తును సైతం అజిత్ వర్గానిదేనని తెలిపింది. అజిత్ వర్గం శరద్ పవార్ చిత్రాన్ని వినియోగించడంపై ఆయన వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం అజిత్ వర్గానికి నోటీసులు జారీ చేసింది.
ప్రత్యేకంగా పార్టీ ఉన్నప్పుడు శరద్ పవార్ ఫొటోను ఎందుకు వినియోగిస్తున్నారని అజిత్ వర్గాన్ని ప్రశ్నించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం శనివారంలోగా సమాధానం ఇవ్వాలంటూ అజిత్ వర్గం ఎన్సీపీని ఆదేశించింది. కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. శరద్ పవార్ ఫొటో, పేరును ఎక్కడా వినియోగించబోమని ఎన్సీపీ బేషరతుగా చెప్పాలని చెప్పింది. ‘మీకు ప్రత్యేక రాజకీయ పార్టీ ఉందని.. కలిసి ఉండకూడదని మేరే నిర్ణయించుకున్నాక ఇప్పుడు ఆయన ఫొటోలును ఎందుకు ఉపయోగిస్తున్నారు.
మీరు సొంత గుర్తింపుతో వెళ్లండి’ అని ధర్మాసనం సూచించింది. అజిత్ పవర్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. పార్టీ శరద్ పవార్ పేరును ఉపయోగించడం లేదని.. కొందరు గుర్తు తెలియని కార్యకర్తలే అలా చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు నియంత్రించడం సాధ్యం కాదని అజిత్ వర్గం పేర్కొంది. దీనికి స్పందించిన ధర్మాసనం ‘పార్టీ కార్యకర్తలను క్రమ శిక్షణగా ఉంచుకోవడం మీ బాధ్యత.
ఇప్పుడు మీరు రెండు పార్టీలు అయినందున గుర్తింపునకు కట్టుబడి ఉండాలి. విడిపోవాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కార్యకర్తలను కూడా మీరే నియంత్రించాలి’ అంటూ తీవ్రంగానే మందలించింది. శరద్ పవార్ వర్గం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు హాజరయ్యారు. అజిత్ వర్గం ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారాన్ని ఉపయోగిస్తుందని తెలిపారు. ఆ గుర్తుతో చారిత్రాత్మకంగా శరద్ పవార్తో ముడిపడి ఉందని.. అలాగే పవార్ వర్గం శరద్ పవార్ ఫొటోలు, పేరు వాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.