లక్నో: ‘జీ20 సదస్సును మణిపూర్లో ఎందుకు నిర్వహించరు?’ అని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ప్రశ్నించారు. అల్లర్లతో అట్టుకుతున్న మణిపూర్లో పరిస్థితి బాగానే ఉందన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు ఆయన నిలదీశారు. జీ 20 సమ్మిట్పై ఒక వార్తా ఛానెల్ నిర్వహించిన చర్చలో అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మండిపడ్డారు. జీ 20 కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. అలాంటప్పుడు ఈ కార్యక్రమాలకు ఆ పార్టీనే స్పాన్సర్ చేయాలని అన్నారు. ప్రభుత్వం, పన్ను చెల్లింపుదారులు ఎందుకు స్పాన్సర్ చేయాలి? అని ప్రశ్నించారు.
కాగా, మణిపూర్ పరిస్థితిపైనా అఖిలేష్ మాట్లాడారు. అక్కడ అంతా బాగానే ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, అలాంటప్పుడు జీ 20 ఈవెంట్ను మణిపూర్లో ఎందుకు నిర్వహించరు? అని కేంద్రాన్ని నిలదీశారు. ఢిల్లీ లేదా ఉత్తరప్రదేశ్లో నిర్వహించడం వల్ల ఎలాంటి సమస్య లేదని, ప్రస్తుతం మణిపూర్ పెద్ద సమస్య అని అన్నారు.
మరోవైపు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’పై ప్రధాని మోదీ, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా స్పందించారు. తమ కూటమిని ‘ఘమండియా’ (అహంకారంతో నిండినది)గా పిలిచే వారే ‘అహంకారంతో ప్రగల్భాలు పలికేవారు’ అని విమర్శించారు.