న్యూఢిల్లీ, జూలై 16: ఆర్డర్ కాపీలు అందలేదన్న సాకుతో తమ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ‘ఈ డిజిటల్ యుగంలోనూ సమాచార చేరవేతకు పావురాల కోసం ఆకాశం వంక చూడాల్సి వస్తున్నది’ అంటూ అసహనం వ్యక్తంచేసింది. కోర్టు ఆదేశాలను వెంటనే అమలు పర్చేందుకు ‘భద్రమైన, నమ్మకమైన, అధికారిక సమాచార వ్యవస్థ’ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సెంట్రల్ జైలులో ఉన్న 13 మంది ఖైదీలకు కోర్టు ఈ నెల 8న బెయిల్ మంజూరు చేసింది. ఆర్డర్ కాపీలు అందలేని వారిని అధికారులు విడుదల చేయలేదు. దీనిని కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఇది చాలా దారుణం అని వ్యాఖ్యానించింది. తాము ప్రతిపాదించిన సమాచార వ్యవస్థను ఫాస్టర్ (ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్)గా అభివర్ణించిన జస్టిస్ రమణ.. దీని ఎలా ఏర్పాటు చేయాలన్నదానిపై రెండువారాల్లో వివరాలు తెలుపాలని సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ను ఆదేశించింది. దీనికి సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవేను అమికస్ క్యూరీగా నియమించింది. దవేతో కలిసి పనిచేయాలని సెక్రెటరీ జనరల్కు సూచించింది. ఈ వ్యవస్థ రూపకల్పనలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సహాయం చేయనున్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ రమణ.. దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఇంటర్నెట్ సదుపాయాలపై అన్ని రాష్ర్టాలు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇంటర్నెట్ వసతి లేకపోతే వేగంగా సమాచార మార్పిడి కష్టమని అభిప్రాయపడ్డారు. ‘ఫాస్టర్’ వ్యవస్థను ఈ నెలలోనే అమలు చేస్తామన్నారు. జైళ్లు, జిల్లా కోర్టులు, హైకోర్టులకు వేగంగా సమాచారం అందేలా ఈ వ్యవస్థ ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.