Gaganyaan | బెంగళూరు, మార్చి 9: అంతరిక్ష రంగంలో భారత్ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచేలా త్వరలోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గగన్యాన్ యాత్రను చేపట్టనుంది. ఇది భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఈ యాత్రకు వ్యోమగాములుగా భారత వాయు సేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఎంపికయ్యారు. వీరు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమయంలో వీరు ధరించిన గ్రౌండ్ యూనిఫామ్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. ఎలాగైతే అంతరిక్ష యానానికి సంబంధించిన ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారో వ్యోమగాములు ధరించనున్న యూనిఫామ్ మీద కూడా ఇస్రో అంతే శ్రద్ధ తీసుకుంది. వ్యోమగాములకు యూనిఫార్మ్ను డిజైన్ చేసే బాధ్యతను బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)కి అప్పగించింది.
యూనిఫాం డిజైన్కు ప్రొఫెసర్లు జొనలీ బాజ్పాయ్, మోహన్ కుమార్ నేతృత్వంలోని నిఫ్ట్ బృందం చాలానే కసరత్తు చేసింది. మొత్తం 70 డిజైన్లను ఇస్రోకు పంపించింది. ఇందులో నీలి రంగు సూట్ను ఇస్రో ఎంపిక చేసింది. ఒకవైపు లేత నీలం, మరో వైపు ముదురు నీలం రంగుల్లో విభిన్నంగా ఈ యూనిఫార్మ్ను డిజైన్ చేశారు. ప్రశాంతత, శాంతి, పట్టుదలను ప్రతిబింబించేలా నీలం రంగును ఎంపిక చేసుకున్నారు. అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు నీలం రంగులో కనిపించడం కూడా ఈ రంగును ఎంచుకోవడానికి ఒక కారణం. వ్యోమగాములు ధరించే బ్యాడ్జ్ను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వ్యోమగాములు భారత వాయుసేనకు చెందిన వారిగా చెప్పేలా రెక్కలు, జాతీయ జెండాలోని అశోక చక్రం, ఇస్రో లోగో కనిపించేలా బ్యాడ్జ్లను తయారుచేశారు.అంతరిక్ష యానానికి వెళ్తున్న వ్యోమగాములు ధరించే యూనిఫామ్ 140 కోట్ల మంది భారతీయులకు నచ్చేలా ఉండాలని, మానవ సహిత అంతరిక్ష సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని గట్టిగా ప్రకటించేలా ఉండాలనే ఆలోచనతో యూనిఫామ్ను డిజైన్ చేసినట్టు నిఫ్ట్ ఫ్యాషన్ టెక్నాలజిస్ట్ మోహన్ కుమార్ తెలిపారు.