ముంబై: మహారాష్ట్ర సీఎం పదవి కోసం 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకుడు అజిత్ పవార్ (Ajit Pawar) తెలిపారు. సీఎం పదవికి ఇప్పుడు కూడా సిద్ధమేనని అన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఎన్సీపీ కీలక సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. ఈ సందర్భంగా ఆయన పూణేలో మీడియాతో మాట్లాడారు. తాను ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో ఎన్సీపీ సమావేశానికి హాజరు కాలేదని చెప్పారు. దీంతో అజిత్ పవార్ బీజేపీలో చేరవచ్చన్న ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? అని రిపోర్టర్లు అడిగారు. దీనికి అజిత్ పవర్ ‘అవును, వంద శాతం సీఎం కావాలనుకుంటున్నాను’, అని సమాధానమిచ్చారు. మహారాష్ట్రలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి ఉండటం ఎందుకు, సీఎం పదవికి ఇప్పుడు కూడా సిద్ధమేనని ఆయన అన్నారు.
కాగా, గత 20 ఏళ్లుగా ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవి మాత్రమే దక్కడంపై అజిత్ పవర్ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిచ్చారు. 2004లో సీఎం పదవిని ఎన్సీపీ చేపట్టాల్సి ఉందన్నారు. నాడు ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయని చెప్పారు. ఎన్సీపీ 71 స్థానాల్లో, కాంగ్రెస్ 69 స్థానాల్లో గెలిచాయన్నారు. దీంతో సీఎం పదవిని ఎన్సీపీ నేత చేపడతారని కాంగ్రెస్తో సహా అంతా భావించారని తెలిపారు. తన సహోద్యోగి దివంగత ఆర్ఆర్ పాటిల్ ముఖ్యమంత్రి అయ్యేవారని అన్నారు. అయితే ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని ఢిల్లీ నుంచి సందేశం వచ్చిందన్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలిచిందని, దీంతో సీఎం పదవి ఆ పార్టీ వద్దే ఉందన్నారు. కాంగ్రెస్ మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్తో కంటే శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంతో కలిసి సంతోషంగా పని చేసినట్లు చెప్పారు.
మరోవైపు 2022 జూన్లో శివసేన నాయకత్వంపై తిరుగుబాటుకు ముందు ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే అసంతృప్తిగా ఉన్నారని అజిత్ పవార్ తెలిపారు. ఆయన మనస్సులో ఏదో జరుగుతోందన్న సంగతి తనకు కూడా తెలుసని అన్నారు. డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో అజిత్ పవార్కు ఉన్న అనుబంధం గురించి కూడా మీడియా ప్రశ్నించింది. జూలై 22న పుట్టడమే తమ ఇద్దరి మధ్య ఉన్న కామన్నెస్ అని అన్నారు. రాజకీయ, సైద్ధాంతిక పరంగా తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ తాము శత్రువులం కాదన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే తమ తమ ప్రసంగాల్లో ఒకరిపై ఒకరు విమర్శించుకున్నప్పటికీ మంచి స్నేహితులని గుర్తు చేశారు. బీజేపీలో మోదీ తర్వాత ప్రధాని పదవి చేపట్టే వారు ఎవరూ లేరన్న అజిత్ పవార్, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాడతాయని జోస్యం చెప్పారు.