న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తాను చేయబోయే తదుపరి ప్రసంగానికి భయపడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ విమర్శించారు. అందుకే తన లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని రాహుల్ ఆరోపించారు. మోదీ కళ్లలో తాను భయాన్ని చూశానని, అందుకే వాళ్లు నన్ను పార్లమెంటులో మాట్లాడకుండా చేశారని ఆయన మండిపడ్డారు. క్రిమినల్ డిఫమేషన్ కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడి లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారి రాహుల్గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడారు.
అదానీ అంశం నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా ఈ అనర్హత నాటకం, కేంద్ర మంత్రుల ఆరోపణలని రాహుల్గాంధీ ఫైరయ్యారు. కేంద్ర ప్రభుత్వ దృష్టిలో దేశమంటే అదానీ, అదానీ అంటే దేశమని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు. నిబంధనలు మార్చి అదానీకి ఎయిర్పోర్టులు ఇచ్చారని, అదానీ షెల్ కంపెనీల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎవరు పెట్టారని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని తాను రెండు ప్రశ్నలు అడిగానని, వాటికి వారి దగ్గర జవాబే లేదని రాహుల్ విమర్శించారు. కేంద్ర మంత్రులు పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. తాను ఇప్పటివరకు దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడానని, ఇకపై కూడా పోరాడుతూనే ఉంటానని ఆయన స్పష్టంచేశారు. అదానీ అంశంపై తాను మాట్లాడటం ప్రారంభించగానే కేంద్రం కుట్రలు మొదలుపెట్టిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పిచ్చి పనులకు తాను బెదిరేది లేదన్నారు. అయితే కోర్టు తీర్పుపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
వాళ్లు తన పార్లమెంట్ సభ్యత్వంపై శాశ్వతంగా అనర్హత వేటువేసిన ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని రాహుల్ చెప్పారు. జీవితాంతం అనర్హత వేటు వేసినా, జీవితాంతం జైల్లో పెట్టినా తన పని తాను చేసుకుపోతూనే ఉంటానని అన్నారు. తానెప్పుడూ సోదర భావం గురించి మాట్లాడుతానని, నిజాలు మాట్లాడుతానని, నిజాలు మాత్రమే మాట్లాడుతానని చెప్పారు.
అదానీ వ్యవహారంపై తాను అన్ని సాక్ష్యాలు పార్లమెంటు ముందుంచినట్లు రాహుల్ తెలిపారు. వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందన్నారు. దీనిపై కనీసం తన వివరణ తీసుకోవాలని స్పీకర్ను కోరినట్లు వెల్లడించారు. తాను మళ్లీ ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. వాయనాడ్ ప్రజలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని రాహుల్ తెలిపారు. ఈ దేశం తనకు ప్రేమ, గౌరవంతోపాటు కావాల్సినవన్నీ ఇచ్చిందన్నారు రాహుల్ గాంధీ.