యూపీలో గెలిచారా? ఢిల్లీ పీఠం గ్యారెంటీయే అన్న నానుడి రాజకీయాల్లో వుంది. మరి.. యూపీలోని ఏ ప్రాంతంలో పాగా వేస్తే ముఖ్యమంత్రి పీఠం గ్యారెంటీ? ఈ విషయం తెలుసా. అవును యూపీలోని కాస్గంజ్ ప్రాంతంలో ఏ పార్టీ జెండా ఎగిరితే.. యూపీ ముఖ్యమంత్రి పీఠం ఆ పార్టీదే. యూపీ నేతలకు, పార్టీలకు ఇదో సెంటిమెంట్. కాస్గంజ్ను మందిరాల ప్రాంతం అని పిలుస్తుంటారు. అలాగని ఇక్కడ ఒక్కటే పార్టీ ఎప్పుడూ గెలుస్తూ రాలేదు. 2007 లో బీఎస్పీ ఇక్కడ పాగా వేసింది. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంది. 2012 లో సమాజ్వాదీ ఇక్కడ పాగా వేసింది. ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంది. 2017 లో బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. దేవేంద్ర సింగ్ రాజ్పుత్ సమాజ్వాదీ అభ్యర్థి మణిపాల్ సింగ్ను ఓడించారు. బీజేపీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంది.
ఈసారి రైతు నేత కుల్దీప్ పాండే కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. ఈయన బీజేపీ అభ్యర్థి దేవంద్ర సింగ్ రాజ్పుత్కు గట్టి పోటీదారుగా నిలబడ్డారు. ఇక సమాజ్వాదీ నుంచి మన్పాల్ సింగ్, బీఎస్పీ నుంచి ప్రభుదయాల్ వర్మకు టిక్కెట్ దక్కింది. ఇక 1977 ఎన్నికల తర్వాత బీజేపీ ఇక్కడి నుంచి 4 సార్లు విజయం సాధించింది. సమాజ్వాదీ 2 సార్లు విజయం సాధించింది. ఈ కాస్గంజ్లో 715 గ్రామాలు, 10 పట్టణాలున్నాయి. ప్రస్తుతం 14,36,719 మంది జనాభా వున్నారు. దాదాపు 60 శాతం అక్షరాస్యత శాతం ఇక్కడ వుంది. ఎక్కువ శాతం విద్యాధికులే కాబట్టి… పార్టీలందరూ చాలా జాగ్రత్తగా ఇక్కడ క్యాంపెయినింగ్ నిర్వహిస్తారు.