Nitish Kumar : బిహార్ రాజకీయాల్లో రెండు దశాబ్దాలకుపైగా చక్రం తిప్పిన సీఎం నితీష్ కుమార్ నాయకత్వానికి తెరపడనుంది. ఆయన రాష్ట్ర రాజకీయాల్ని వదిలి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అంటే త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఆయన కేంద్రంలో ఏ పదవిని స్వీకరిస్తారో తెలియదు కానీ.. రాష్ట్రంలో ఆయన సీఎం స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ఉత్కంఠ మాత్రం నెలకొంది.
తాజా అంచనా ప్రకారం ఈసారి బిహార్ సీఎం పదవిని బీజేపీ తీసుకోనుంది. జేడీయూ, ఇతర పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కుతాయి. అయితే, బీజేపీ తరఫున సీఎంగా బిహార్కు ఎవరు నేతృత్వం వహిస్తారనే చర్చ మొదలైంది. సీఎంగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నా ప్రధానంగా వినిపిస్తున్న పేరు డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి. ఓబీసీ వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి కుష్వాడా నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నితీష్ కుమార్తో కలిసి ఆయనకు పాలనలో ఉన్న అనుభవం, ఎన్డీయే ప్రభుత్వంలో, బీజేపీలో ఉన్న పలుకుబడి వంటివి సామ్రాట్ చౌదరిని సీఎం రేసులో ముందుంచుతున్నాయి. ఆయనకు సంస్థాగత, పాలనాపరమైన అనుభవం ఉందని, పార్టీ అట్టడుగు స్థాయిపై కూడా పట్టుందని బీజేపీ అధిష్టానం విశ్వసిస్తోంది.
సామ్రాట్ చౌదరితోపాటు సీఎం అభ్యర్థిగా కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన బీజేపీ నుంచి ఎన్నికైన యాదవ సామాజికవర్గపు నేత. కేంద్రంలో అమిత్ షాతో సన్నిహితంగా ఉంటారు. ఆయన వద్ద సహాయక మంత్రిగా పని చేశారు. నిత్యానందకు పదవి ఇస్తే యాదవ సామాజికవర్గంలో మంచి పట్టుదొరుకుతుందని బీజేపీ ఆలోచన. దీనిద్వారా తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నేతల్ని ఎదుర్కోవచ్చు. సామ్రాట్, నిత్యానందతోపాటు బిహార్ మంత్రిగా ఉన్న దిలీప్ జైశ్వాల్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తోంది., ఆయన వైశ్య (కల్వార్) వర్గానికి చెందిన వారు. వీరితోపాటు సంజీవ్ చౌరాసియా పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే, వీరిలో బీజేపీ అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటుందో చూడాలి.