H-1B Visa Scam | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): అమెరికాలో ఉద్యోగం చేయాలన్నది అనేకమంది భారతీయుల కల. హెచ్-1బీ వీసాను ఎలాగైనా సంపాదించి అగ్రరాజ్యం వెళ్లాలని బలంగా కోరుకొనే వారు ఏటా లక్షల్లో ఉంటారు. అయితే, పరిమితంగా ఉండే ఈ వీసాలు లభించేది కొందరికి మాత్రమే. వీసా లభించని వారు తమ అదృష్టం ఇంతేనని సరిపెట్టుకొనే సందర్భాలూ అనేకం. అయితే, తమకు నచ్చినవారికి హెచ్-1బీ వీసాలు వచ్చేలా కొందరు అక్రమార్కులు లాటరీ రిగ్గింగ్కు పాల్పడుతున్నట్టు అమెరికాకు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూమ్బర్గ్’ ఓ సంచలన కథనంలో వెల్లడించింది. ఆదిలాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి ఈ స్కామ్ నిందితుల్లో ఒకరని వివరాలతో సహా బయటపెట్టింది.
దీంతో ప్రస్తుతం ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నది. అమెరికా కంపెనీల్లో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు హెచ్-1బీ వీసా వీలు కల్పిస్తుంది. టెక్ కంపెనీలు దీనిపై ఆధారపడి ఏటా భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకొంటున్నాయి. ఏటా పరిమిత సంఖ్యలో 85 వేల హెచ్-1బీ వీసాలను మాత్రమే జారీ చేస్తారు. వీటి కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకొంటూ ఉంటారు. ప్రారంభంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాతిపదికన వీసాలను జారీ చేసినప్పటికీ గత కొన్నేండ్లుగా కంప్యూటరైజ్డ్ జనరేటెడ్ లాటరీ ద్వారా ఎంపిక చేసి అర్హులైన వారికి వీసాలు ఇస్తున్నారు. అయితే, ఈ లాటరీ ప్రక్రియలో కొన్ని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నట్టు ‘బ్లూమ్బర్గ్’ పరిశీలనలో తాజాగా తేలింది.
ఎలా కనిపెట్టారంటే?
హెచ్-1బీ వీసాల కోసం 2023లో 4,46,000 దరఖాస్తులు వచ్చాయి. క్రితం ఏడాదితో పోలిస్తే, ఇది చాలా ఎక్కువగా ఉన్నది. 2020 నుంచి దరఖాస్తులు అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో బ్లూమ్బర్గ్ టీమ్.. వీసా దరఖాస్తులు, వీసాల జారీ, లాటరీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా ప్రభుత్వం ఇచ్చిన డేటా సాయంతో విశ్లేషించింది. వీసాలను ఎలాగైనా దక్కించుకోవడానికి కొందరు అక్రమార్కులు లాటరీ రిగ్గింగ్కు పాల్పడుతున్నట్టు ఈ విశ్లేషణలో బ్లూమ్బర్గ్ నిర్ధారణకు వచ్చింది. ఒకే అభ్యర్థి పేరును వివిధ కంపెనీల ద్వారా కోట్ చేస్తూ.. ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు దాఖలు చేసినట్టు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. ఇలా.. ఒక్క ఏడాదిలోనే 15,500 వీసాలు పక్కదారి పట్టినట్టు వివరించింది. అంటే జారీ చేసిన ప్రతీ ఆరు వీసాల్లో ఒకటి అక్రమార్కులకు చేరినట్టు తెలిపింది. నాలుగేండ్ల వ్యవధిలో, ఒక కంపెనీ ఒకే దరఖాస్తుదారుడి పేరును ఏకంగా 15సార్లు రిజిస్టర్ చేసినట్టు, దీని కోసం డజనుకు పైగా కంపెనీలను వాడుకొన్నట్టు వెల్లడించింది. దీంతో వీసాలు దక్కాల్సిన అర్హులకు అవి దక్కకుండాపోయాయని వివరించింది.
సూత్రధారుల్లో కాంగ్రెస్ నేత
ఆదిలాబాద్కు చెందిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి.. పలు కంపెనీల సాయంతో ఈ లాటరీ రిగ్గింగ్లో భాగమైనట్టు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. 2020 నుంచి ఇప్పటివరకూ ఈయనకు చెందిన కంపెనీలకు 300కు పైగా హెచ్-1బీ వీసాలు దక్కినట్టు వివరించింది. మెషీన్ లర్నింగ్ టెక్నాలజీస్ ఎల్ఎల్సీ, డేటా సైన్స్ టెక్నాలజీస్ ఎల్ఎల్సీ, రోబోటిక్స్ టెక్నాలజీస్ ఎల్ఎల్సీ ఇలా ఒకే పేరును స్ఫురించేలా దాదాపు 15 కంపెనీల ద్వారా శ్రీనివాస్ రెడ్డి ఈ రిగ్గింగ్లో పాల్గొన్నట్టు తమ విశ్లేషణలో వెల్లడైందని బ్లూమ్బర్గ్ తెలిపింది. శ్రీనివాస్ రెడ్డిని ‘మ్యాన్ బిహైండ్ ఏ స్కీమ్’ అని పేర్కొంటూ ఈ వివరాలను బ్లూమ్బర్గ్ ప్రత్యేకంగా ప్రచురించింది. అక్రమార్కులు తమ దగ్గరికి వచ్చిన వారికే వీసాలు రావాలనే దురుద్దేశంతో ఇలా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నట్టు బ్లూమ్బర్గ్ వెల్లడించింది. అక్రమాలకు పాల్పడ్డ ఆయా కంపెనీలు ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్నట్టు వివరించింది.
కఠిన నిబంధనలు
హెచ్-1బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసాలు జరుగుతున్నట్టు గతంలో కూడా పెద్దయెత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఈ మోసాలను అరికట్టేందుకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) గత జనవరిలో కీలక నిర్ణయం తీసుకొన్నది. 2025 ఆర్థిక సంవత్సరానికి జారీ చేసే వీసాల ఎంపిక ప్రక్రియకు కొత్త నిబంధనలు ప్రకటించింది. ఒక లబ్ధిదారు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకున్నా.. ఒకే అప్లికేషన్గా పరిగణిస్తామని వెల్లడించింది. ప్రతి లబ్ధిదారు సరైన పాస్పోర్ట్ వివరాలు, ప్రయాణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలని రూల్ పెట్టింది. తప్పుడు సమాచారం ఇస్తే ఆ పిటిషన్లను రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఎవరీ కంది శ్రీనివాస్ రెడ్డి?
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం హస్నాపూర్కు చెందిన కంది శ్రీనివాసరెడ్డి అమెరికాలో పలు సాఫ్ట్వేర్ సంస్థలను నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతో రెండేండ్ల కిందట రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత బీజేపీలో చేరారు. అయితే, ఆ పార్టీలో టికెట్ లభించే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం పెద్దలకు భారీగా డబ్బులు ఇచ్చి కాంగ్రెస్లో అయన చేరినట్టు ప్రచారం జరిగింది. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఎన్నికలకు ముందు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు పెద్ద సంఖ్యలో ఈయన కుక్కర్లు పంపిణీ చేశారు. అయితే కాంగ్రెస్లోకి ఈయన రాకను పార్టీ సీనియర్ నాయకులు సుజాత, సాజిద్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ, కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో తమ పదవులకు వాళ్లు రాజీనామా చేశారు. స్థానిక నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. నెలలో నియోజకవర్గంలో 15 రోజులు.. అమెరికాలో 15 రోజులు శ్రీనివాస్ రెడ్డి ఉంటారని స్థానికులు చెబుతారు. ఈయనకు ఓ న్యూస్ ఛానల్ కూడా ఉంది.