Green Card | అమెరికాలో హెచ్-1 బీ వీసా కింద పని చేస్తున్న భారతీయ టెక్కీలకు జో బైడెన్ సర్కార్ తీపి కబురందించింది. గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ సమయం తగ్గించాలని నిర్ణయించింది. వచ్చే ఏప్రిల్ నాటికి కేవలం ఆరు నెలల్లో మిగిలి ఉన్న అన్ని గ్రీన్ కార్డు అప్లికేషన్ల ప్రాసెసింగ్ పూర్తి చేయాలని కూడా ప్రెసిడెన్షియల్ కమిషన్ నిర్ణయించింది. ఒకవేళ ఈ సిఫారసు అమలుకు నోచుకుంటే భారత్, చైనా వంటి దేశాల నుంచి అమెరికాలో జీవనం సాగిస్తున్న వేల మంది ఇమ్మిగ్రెంట్ కుటుంబాలకు బెనిఫిట్ కానున్నది.
ఇమ్మిగ్రెంట్ వీసాపై వచ్చి అమెరికాలో పని చేసే నిపుణులకు శాశ్వత నివాసం కల్పించే అఫిషియల్ డాక్యుమెంట్ ఈ గ్రీన్ కార్డు. హెచ్-1 బీ వీసాపై వచ్చి పని చేస్తున్న అత్యంత నైపుణ్యం గల ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్.. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ పాలసీతో ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పుడు ప్రతి దేశానికి ఏడు శాతం కోటా ప్రకారమే గ్రీన్ కార్డులు జారీ అవుతున్నాయి. గ్రీన్ కార్డుల కోసం కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ ఐటీ నిపుణులు వేచి చూస్తున్నారు.
ఏషియన్ అమెరికన్లు, నేటివ్ హవాయన్స్, పసిఫిక్ ఐలాండర్స్పై ఏర్పాటైన ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిషన్ తన సిఫారసులను గత మే 12న జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్కు సమర్పించింది. శుక్రవారం కమిషన్ సిఫారసులపై తొలి నివేదికను విడుదల చేసింది. దీన్ని జో బైడెన్ ఆమోదానికి పంపే ముందు వైట్ హౌస్ డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ సమీక్షిస్తున్నది.
కొవిడ్-19 సంబంధ మూసివేతలు, సిబ్బందికి పరిమితులు, 2017 ట్రావెల్ బ్యాన్, వార్షిక పరిమితులతో గ్రీన్ కార్డుల జారీ క్లిష్టతరంగా మారింది. ప్రతి యేటా 2.26 లక్షల గ్రీన్ కార్డులు జారీ చేయాల్సి ఉన్నా, 2021లో కేవలం 65,452 కుటుంబాల ఆధారిత గ్రీన్ కార్డులు మాత్రమే జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయడానికి అదనపు అధికారులను నియమించుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్స్ నేషనల్ వీసా సెంటర్ (ఎన్వీసీ)కి ప్రెసిడెన్షియల్ కమిషన్ సూచించింది. మూడు నెలల్లో 100 శాతం గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఇంటర్వ్యూలు జరుపాలని సిఫారసు చేసింది.