న్యూఢిల్లీ, అక్టోబర్ 30: రుణ యాప్ల ఆగడాలపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పులిచ్చి వసూళ్లు చేసే క్రమంలో వేధింపులు, బ్లాక్మెయిళ్లకు పాల్పడటమే కాకుండా బాధితులను దోచుకుంటున్న ఈ రుణయాప్లకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇలాంటి చైనా నియంత్రిత యాప్ల వల్ల అనేకమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల భద్రత, ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతపై ప్రభావం చూపుతున్న ఈ రుణయాప్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించింది. అధిక వడ్డీ రేట్లతో స్వల్పకాలిక రుణాలిస్తున్న ఈ అక్రమ డిజిటల్ రుణయాప్లపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయని పేర్కొన్నది. అప్పును రికవరీ చేసే క్రమంలో ఏజెంట్లు రుణగ్రహీతల వ్యక్తిగత డాటా, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్, వేధింపులకు దిగుతున్నారని తెలిపింది.