ముంబై: నా వధువు ఎక్కడ? అంటూ సుమారు 50 మంది పురుషులు గుర్రాలపై ఊరేగుతూ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమాజంలో పెరుగుతున్న లింగ అసమానతపై వినూత్నంగా నిరసన తెలిపారు. 2019-21 జాతీయ కుంటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మహారాష్ట్రలో వెయ్యి మంది పురుషులకుగాను 920 మంది స్త్రీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సోలాపూర్కు చెందిన కొందరు పెళ్లి కాని పురుషులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక వరుల సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు బుధవారం పెళ్లికుమారుల గెటప్ వేశారు. పెళ్లిలో ధరించే తలపాగా పెట్టుకుని డప్పు వాయిద్యాల మధ్య గుర్రాలపై ఊరేగుతూ సోలాపూర్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ‘నాకు కాబోయే భార్య ఎక్కడ?’ అంటూ ఫ్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.
మహారాష్ట్రలో లింగ అసమానతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్త్రీల సంఖ్య తక్కువగా ఉండటంతో తమకు వధువులు దొరకడం లేదని వాపోయారు. రాష్ట్రంలో స్త్రీ, పురుషుల నిష్పత్తిని మెరుగుపరచాలని, ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్డీటీ) చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Maharashtra: About 50 bachelors, wearing 'sehras' (wedding crowns), took out a procession with drums and horses to the Collector's office in Solapur, demanding implementation of the Pre-Conception and Pre-Natal Diagnostic Techniques (PCPNDT) Act (22.12) pic.twitter.com/Q4rHNZdr9A
— ANI (@ANI) December 23, 2022