అనేక ఢక్కాముక్కీలు తిన్న తర్వాత ఉదయ్పూర్ వేదికగా కాంగ్రెస్ ప్రక్షాళనకు దిగింది. పార్టీకి నూతన జవసత్వాలు కల్పించి, కేడర్కు ఎనలేని ధైర్యం నూరిపోయాలని తెగ తాపత్రయ పడుతోంది. ఈ దిశగానే కొత్త కొత్త ప్రయత్నాలు, కొత్త కొత్త ప్లాన్లను రూపొందిస్తోంది. ఎలాగైనా సరే… బీజేపీని ఓడించి, ప్రభుత్వాన్ని స్థాపించాలని కింద మీదా పడుతోంది.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగే చింతన శిబిర్కి 450 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. పార్టీని సంస్థాగతంగా పునర్ నిర్మించి, కొత్త రూపు ఇవ్వాలన్నది కాంగ్రెస్ తాపత్రయం. గతంలోనూ అనేక చింతన్ శిబిరాలు కాంగ్రెస్ నిర్వహించింది. పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఫలితం గుండు సున్నా. చింతన్ శిబిర్ నిర్వహించిన ప్రతీసారీ పార్టీకి ఏమీ ఒరగలేదు. నిండా మునిగిపోయింది.
కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఇలాంటి చింతన్ శిబిరాలు జరిగాయి. తాజా శిబిరం ఐదో శిబిరం. ఈ నాలుగు సార్లలో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్కు అనుకూలమైన ఫలితాలను రాబట్టుకోగలిగింది. మూడు సార్లు అట్టర్ ప్లాఫ్.
1974 లో మొట్ట మొదటి చింతన్ శిబిర్…
1974 లో కాంగ్రెస్ మొట్ట మొదటి చింతన్ శిబిర్ నిర్వహించింది. యూపీలోని బులందర్ షహర్లో జరిగింది. జయప్రకాశ్ నారాయణ్ ప్రభావాన్ని తట్టుకోలేక.. ఏం చేయాలన్న దానిపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ శిబిర్ను నిర్వహించారు. ఇప్పటి లాగే అనేక కమిటీలు వేశారు. అయినా లాభం లేదు. బూడిదలో పోసిన పన్నీరైంది. చివరికి కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే కూర్చుంది.
1996, మధ్యప్రదేశ్ వేదికగా రెండోది…
కేంద్రంలో అధికారం కోల్పోయింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగి 7 ఏళ్ల తర్వాత గాంధీ పరివారం కాంగ్రెస్లోకి తిరిగి వచ్చేసింది. నాటి అధ్యక్షుడు సీతారాం కేసరీని అధ్యక్ష పదవి నుంచి దింపేసి, ఆ స్థానాన్ని సోనియా ఆక్రమించారు. ఈ సందర్భంగా పార్టీకి ఓ సరైన దిశ, దశ ఇవ్వాలన్న నేపథ్యంలో ఓ చింతన్ శిబిర్ జరిగింది. మధ్యప్రదేశ్లోని పంచమఢీ ప్రాంతంలో రెండో శిబిర్ జరిగింది.
1998,99 లో జరిగిన ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని హస్తం నిర్ణయించింది. 1998 లో 141 సీట్లు, 1999 లో 114 సీట్లు లభించాయి. అప్పుడు వాజ్పాయ్ నేతృత్వంలోని బీజేపీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. వాజ్పాయ్ ముఖోటాతో బీజేపీ ప్రభంజనం అద్భుతంగా సాగింది. ఇలా రెండో శిబిరం కూడా కాంగ్రెస్కు కలిసి రాలేదు.
2003 లో సిమ్లా వేదికగా మూడోది…
2003 లో సిమ్లా వేదికగా కాంగ్రెస్ ఓ చింతన్ శిబిర్ నిర్వహించింది. ఇది అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఈ చింతన్ శిబిర్ కాంగ్రెస్కు కొత్త ఊపిరులూదింది. సంకీర్ణ రాజకీయాలు చేయాలని, పొత్తులు పెట్టుకోవాలని ఈ చింతన్ శిబిర్లోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్సీపీ, ఆర్జేడీ లాంటి పార్టీలు కాంగ్రెస్తో జట్టు కట్టాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ శిబిర్ ఒక్కటే కాంగ్రెస్కు పండగ తెచ్చి పెట్టింది.
2013 లో జైపూర్ వేదికగా నాలుగోది…
2003 శిబిర్ ఊపిరులూదిందన్న ధీమాతో కాంగ్రెస్ ఎన్నికల కంటే యేడాది ముందు 2013 లో జైపూర్ వేదికగా ఓ శిబిర్ నిర్వహించింది. ఇందులోనే రాహుల్కు ప్రమోషన్ దొరికింది. అప్పటి వరకూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ వస్తున్న రాహుల్.. పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతల్లోకి వచ్చేశారు. పార్టీ గురించి చర్చోపచర్చలు చేశారు. కానీ.. 2014 లో ఘోర పరాభవం పాలైంది కాంగ్రెస్.