ముంబై: ప్రత్యర్థి పార్టీలు ఏం చేసినా బీజేపీ నేతలు హిందూత్వ వ్యతిరేకి, దేశద్రోహి అనే ముద్ర వేస్తారని, హిందూత్వను వీడాలని డిమాండ్ చేస్తారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ – ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ మధ్య పొత్తు కుదిరిన సందర్భంగా ఉద్ధవ్ థాకరే మీడియాతో మాట్లాడారు.
బీజేపీ మాతృసంస్థ అయిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మసీదుకు వెళ్లారని, ఆయన హిందూత్వను వీడారా..? అని ఉద్ధవ్ థాకరే ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్లో బీజేపీ, పీడీపీ కూటమి కట్టాయని, అప్పుడు బీజేపీ హిందూత్వను వీడిందా అని నిలదీశారు. ‘వాళ్లు ఏం చేసినా రైటే అవుతుంది. మనం ఏదైనా చేస్తే మాత్రం హిందూత్వను వీడాలి’ అని ఆయన ఎద్దేవా చేశారు.
అదేవిధంగా ముంబై సివిక్ పోల్స్పై అధికార షిండే వర్గం శివసేన-బీజేపీ కూటమి ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై కూడా ఉద్ధవ్ థాకరే ఆగ్రహం వ్యక్తంచేశారు. ద్రోహుల (మహారాష్ట్ర సర్కారు)కు దమ్ముంటే ఎన్నికలు నిర్వహించాలని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికలకు సంబంధించి తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.