న్యూఢిల్లీ : ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ క్షమాపణలు చెప్పింది. అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నామని, భవిష్యత్లో మరోసారి పొరపాటు జరుగకుండా చర్యలు తీసుకుంటామని వాట్సాప్ పేర్కొంది. అయితే, న్యూ ఇయర్ సందర్భంగా మెటా యాజమాన్యంలో వాట్సాప్ ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో వాట్సాప్ చూపించిన గ్లోబ్లో పాక్ ఆక్రమిత కశ్మీర్తోపాటు చైనా తమ భూభాగాలుగా చెప్పుకుంటున్న కొన్నింటిని వాట్సాప్ భారత్ నుంచి మినహాయించింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు వాట్సాప్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సైతం స్పందించారు.
వెంటనే తప్పును సరిదిద్దాలని వాట్సాప్కు సూచించారు. భారత్లో ఉండి వ్యాపారాలు చేసే, కొనసాగాలనుకునే అన్ని ప్లాట్ఫాంలు తప్పనిసరిగా సరైన భారత్కు చెందిన పటాలనే ఉపయోగించాలని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన వాట్సాప్ అనుకోనివిధంగా జరిగిన తప్పును ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది. వీడియోను తొలగించామంటూ చెప్పిన మెటా సంస్థ.. భవిష్యత్లో మరోసారి పొరపాటు జరుగకుండా చర్యలు తీసుకుంటామంటూ క్షమాపణలు చెప్పింది. ఇంతకు ముందు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భారత మ్యాప్ను తప్పుగా చూపినందుకు జూమ్ సీఈవో ఎరిక్ యువాన్ను సైతం మంత్రి మండిపడ్డారు.