CORAS : జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లే వందేభారత్ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ రైలుకు ఇకపై మరింత రక్షణ దొరకనుంది. ఈ రైలుకు ఇకపై కోరాస్ బృందం రక్షణ కల్పించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. గురువారం నుంచి ఈ రైలుకు కోరాస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జమ్మూ–శ్రీనగర్ మార్గం 327 కిలోమీటర్ల పొడవైంది. ఇది జమ్మూ–కార్తా–శ్రీనగర్–బారాముల్లా మీదుగా సాగుతుంది.
అనేక పద్ధతుల్లో రైళ్లకు రక్షణ కల్పించే లక్ష్యంలో భాగంగా ఈ రైలుకు కోరాస్ సైనిక బృందాన్ని కేంద్రం నియమించింది. ఇది సీఆర్పీఎఫ్, ఎన్ఎస్జీ, సీఐఎస్ఎఫ్, ఆర్ఎస్పీఎఫ్లకు సంబంధించింది కాదు. ఇది రైళ్ల రక్షణ కోసం ప్రత్యేకంగా ఆర్పీఎఫ్ నుంచి ఏర్పాటైన విభాగం. 2019 ఆగష్టులో కేంద్రం దీన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని రైళ్లకు, ప్రయాణికులకు రక్షణ కల్పించే లక్ష్యంతో ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసింది. మన దేశంలో వందేభారత్ సహా అనేక రైళ్లపై ఆకతాయిలు రాళ్లు రువ్వుతున్నారు. ఈ ఘటనల్లో రైళ్లు ధ్వంసం కావడంతోపాటు పలువురు ప్రయాణికులు కూడా గాయపడుతున్నారు. ఇలాంటి వాటి నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్రం కోరాస్ను తీసుకొచ్చింది.
కోరాస్ అంటే, ద కమాండోస్ ఫర్ రైల్వే సెక్యూరిటీ. ఇది ఆర్పీఎఫ్లోని ఒక ప్రత్యేక బెటాలియన్. వీరికి రైళ్లలో రక్షణ గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీరికి హరియాణాలోని మానేసర్లో ఎన్ఎస్జీ కేంద్రంలో శిక్షణ ఇస్తారు. ప్రస్తుతానికి దేశంలో సమస్యాత్మక ప్రాంతాల్లో రైల్వే ప్రయాణికులు, ఆస్తులు, రైళ్ల రక్షణ కోసం కోరాస్ను వినియోగిస్తున్నారు. జమ్ము కాశ్మీర్, మణిపూర్, త్రిపుర, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వీరు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో 659 మంది సభ్యులున్నట్లు తెలుస్తోంది.