Himachal CM : జరిగిందేదో జరిగిందని, ఇకపై రాష్ట్ర భవిష్యత్తుపైనే తాము దృష్టి సారిస్తున్నామని హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని ధిక్కరించి, అనర్హతకు గురై, బీజేపీలో చేరిన ఘటన గురించి ఆయన మాట్లాడారు. హోలీ వేడుకల్లో ఉన్న సుఖూ దగ్గర మీడియా ఆ ప్రస్తావన తీసుకురావడంతో పైవిధంగా స్పందించారు. గతంలో జరిగింది ఇప్పుడు గతమేనని, దాని గురించి మాట్లాడాల్సి ఏమీ లేదని చెప్పారు.
ఇకపై రాష్ట్ర భవిష్యత్తుపై తన ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించిందని తెలిపారు. 2032 నాటికి హిమాచల్ప్రదేశ్ను సుభిక్షమైన, ధనికమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని సుఖు చెప్పారు. ప్రజలకు అన్నీ తెలుసని వ్యాఖ్యానించారు. హోలీ పండుగ సందర్భంగా ఆయన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ఇటీవల హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటువేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్టీ విప్ను ధిక్కరించడం, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి కాంగ్రెస్ను ఓడించడం లాంటి కారణాలవల్ల వారిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు.
దాంతో హిమాచల్ అసెంబ్లీలోని మొత్తం 68 మంది సభ్యులకుగాను కాంగ్రెస్ బలం 34కు తగ్గింది. రెండు రోజుల క్రితం ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడంతో బీజేపీ బలం 28కి పెరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో ఖాళీ అయిన 6 స్థానాలకు లోక్సభ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఆరు స్థానాలకు జూన్ 1న చివరి దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో బీజేపీ గనుక ఆరుకు ఆరు స్థానాలు గెలిస్తే సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ప్రమాదంలో పడినట్టే.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ కూడా అసెంబ్లీలో సమవుజ్జీగా ఉంటుంది. ఎవరికీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడే మెజారిటీ లేని కారణంగా సుఖు సర్కారుపై మళ్లీ అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంది. అప్పుడు తీర్మానానికి అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు పడుతాయి. దాంతో మెజారిటీ లేని కారణంగా సుఖు సభ విశ్వాసం కోల్పోయినట్లు అవుతుంది. ఆయన ప్రభుత్వం కూలిపోతుంది.