Aravind Kejriwal | వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై ఢిల్లీ సీఎం- ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశంపైనే తమ పార్టీ పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ధ్వజమెత్తారు. అధికార బలంతోనే ఢిల్లీ ఆర్డినెన్స్, సవరణ బిల్లు తెచ్చారన్నారు. ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ బెదిరింపులు విఫలం అయ్యాయన్నారు.
ఢిల్లీ ఆర్డినెన్స్, బిల్లులతో ఢిల్లీ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని అరవింద్ కేజ్రీవాల్ మండి పడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ బెదిరింపులు ఢిల్లీలో విఫలం అయ్యాయన్నారు. తనను తల వంచుకునేలా చేస్తానని ఓ బీజేపీ నేత బెదిరింపులకు దిగాడని చెప్పారు. కానీ తానుగానీ, రెండు కోట్ల మంది ఢిల్లీ పౌరులు గానీ తల వంచరని స్పష్టం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలవుతుందన్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో `ఢిల్లీ సర్వీసుల బిల్లును విపక్షాల నిరసన మధ్య కేంద్ర ప్రభుత్వం ఆమోదింపచేసుకున్నది. రాష్ట్రపతి ఆమోదం తెలుపడంతో అది చట్టంగా మారింది. దీంతో ఢిల్లీలో ఐఏఎస్లు, ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయింది.