బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇంటి ముందు గురువారం మధ్యాహ్నం ఓ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య తన ఇంటి నుంచి బయలుదేరుతుండగా పొరుగింట్లో ఉండే నరోత్తమ్ అనే వృద్ధుడు ఆయన కారుకు అడ్డుపడ్డాడు. సీఎం ఇంటికి వచ్చే అతిథుల వాహనాల వల్ల తాను, తన కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇంతలో సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పక్కకు లాగుతుండగా సిద్ధరామయ్య జోక్యం చేసుకుని వారిని వారించారు. దాంతో భద్రతా సిబ్బంది వృద్ధుడిని సిద్ధరామయ్య దగ్గరికి అనుమతించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన నరోత్తమ్ సిద్ధరామయ్యను గట్టిగా నిలదీశారు. ‘నిత్యం మీ ఇంటికి వచ్చే అతిథుల వల్ల మేం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’ అని మండిపడ్డారు.
‘మీ ఇంటికి వచ్చే అతిథులు వీధి నిండా వాహనాలను పార్క్ చేస్తున్నారు. దాంతో మా వాహనాలను పార్క్ చేయాలన్నా, పార్క్ చేసిన వాహనాలను బయటికి తీయాలన్నా మేం చాలా అవస్థలు పడుతున్నాం. గత ఐదేండ్లుగా ఎందుకు మాకీ నరక యాతన..?’ అని నరోత్తమ్ ప్రశ్నించారు. దాంతో ఇంటి దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి ఆ పెద్దాయన పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
ఇకపై మీకు పార్కింగ్ సమస్య ఉండదని, మా సెక్యూరిటీ సిబ్బంది మీ సమస్యను పరిష్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య ఆ వృద్ధుడికి నచ్చజెప్పారు. అనంతరం సీఎం కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ ఇంకా తన గతంలో కేటాయించిన ప్రతిపక్ష నేత బంగ్లాలోనే ఉంటున్నారు. ఆగస్టులో ఆయన సీఎం అధికారిక నివాసానికి మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.