బెంగుళూరు: ఇదో బాలీవుడ్ స్టోరీ లాంటిదే. రోల్స్ రాయ్స్ ఫాంథమ్ కారును సోమవారం బెంగుళూరులో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ కారు ఎవరిదని ఆరా తీస్తే.. అది బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) పేరు మీద రిజిస్టర్ అయినట్లు తేలింది. రవాణాశాఖ అధికారులు సోమవారం సుమారు పది లగ్జరీ కార్లను సీజ్ చేశారు. వాటిల్లో రోల్స్ రాయ్స్, ఫెరారీ, పోర్సే లాంటి కార్లు ఉన్నాయి. ఇక రోల్స్ రాయ్స్ కారు ఏకంగా బిగ్బి అమితాబ్ పేరు మీద రిజిస్టరై ఉంది. అయితే రోడ్డు ట్యాక్స్ కట్టకుండా.. పెద్ద పెద్ద బడాబాబుల కార్లు తిరుగుతున్నట్లు అధికారులు గమనించారు. ఓ ఆపరేషన్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు.. మొత్తం పది లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఆ విలాసవంతమైన కార్ల జాబితాలో అమితాబ్ది కూడా ఉంది.
సిలికాన్ సిటీ బెంగుళూరులో చాలా మంది లగ్జరీ కారు ఓనర్లు ట్యాక్స్ కట్టకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. అంతేకాదు.. నకిలీ డాక్యుమెంట్లతో కాలం వెళ్లదీస్తున్నారు. బెంగుళూరులోని ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డు, విట్టల్ మాల్యా రోడ్డు లాంటి సంపన్నులుండే వీధుల్లో అవి తిరుగుతున్నట్లు గుర్తించారు. రోడ్డు ట్యాక్స్, ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా కార్లు నడుపుతున్నట్లు తేల్చారు. అయితే అమితాబ్ పేరు మీద రిజిస్టర్ అయిన కారు స్టోరీ గమ్మత్తుగా ఉంది.
సినీ నిర్మాత విధూ వినోద్ చోప్రా గిఫ్ట్గా ఇచ్చిన రోల్స్ రాయ్స్ ఫాంథమ్ కారును కొన్నేళ్ల క్రితం అమితాబ్ అమ్మేశారు. 2019లో 3.5 కోట్ల ఖరీదైన రోల్స్ రాయ్స్ కారును అమితాబ్ అమ్మారు. బెంగుళూరులోని యూసుఫ్ షరీఫ్ అనే వ్యాపారవేత్త దాన్ని కొన్నాడు. యూసుఫ్ను స్క్రాప్ బాబు అని కూడా పిలుస్తుంటారు. ఉమ్రా డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా అతను నడిపిస్తున్నాడు.
స్క్రాప్ బాబుది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ . అతను ఇప్పుడో సంపన్నుడు. ప్రభుత్వ ఫ్యాక్టరీలు, గవర్నమెంట్ ప్రాజెక్టులకు చెందిన చెత్తను కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల అతనో ఇంటర్వ్యూలో చెప్పాడు. జీరో నుంచి మిలియనీర్గా మారిన స్క్రాప్ బాబు.. కేజీఎఫ్ బంగారు గనిలో వాడిన చెత్త వస్తువులను కొని వాటిల్లోంచి గోల్డ్ తీసేవాడని ఆరోపణలు ఉన్నాయి.
బెంగుళూరు ట్రాన్స్పోర్ట్ అధికారుల ప్రకారం.. అమితాబ్ వద్ద రోల్స్ రాయ్స్ కారును 6 కోట్లకు బాబు కొన్నట్లు తెలుస్తోంది. అయితే కారు కొన్న తర్వాత పేరు మార్చలేదు. అదే పేరుతో అతను కారును నడుపుతున్నాడు. ఎంజీ రోడ్డులో చెకింగ్ సమయంలో ఆ కారును సీజ్ చేశారు. తన కారును రిలీజ్ చేయాలని స్క్రాప్ బాబు ఆర్టీవో అధికారుల్ని రిక్వెస్ట్ చేశారు. ముందుగా ఆ కారును రిజిస్టర్ చేసుకోవాలని, ఆ తర్వాత రోడ్డు ట్యాక్స్ జరిమానాలు కడితేనే దాన్ని రిలీజ్ చేస్తామని అదికారులు చెప్పారు.
ఈ కేసులో పోలీసుల, ట్రాన్స్పోర్ట్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అమితాబ్కు నోటీసలు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఫాంథమ్ కారు కొన్న ఓనర్ దాని ఒరిజినల్ పేపర్లు సమర్పిస్తే, అప్పుడు అమితాబ్కు నోటీసులు ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ కారు ఓనర్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వకుంటే, అప్పుడు అమితాబ్కు నోటీసు తప్పదని అధికారులు అంటున్నారు.