MQ-9 Reaper Drone | ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాధినేతలు భారత్కు తరలివచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇవాళ దిల్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నివాసానికి వెళ్లిన బైడెన్ పలు కీలక విషయాలు చర్చించారని సమాచారం. జేఈ జెట్ ఇంజిన్ ఒప్పందం, ఎంక్యూ-9 రేపర్ ప్రిడేటర్ డ్రోన్లు, 5జీ, 6జీ స్పెక్ట్రమ్, క్లిష్టమైన అధునాతన సాంకేతికతల అభివృద్ధికి పరస్పర సహకారం, అణురంగంలో పురోగతి తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా ఎంక్యూ-9 రేపర్ డ్రోన్ల కొనుగోలు అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ప్రిడేటర్ డ్రోన్ల ప్రత్యేకతలు ఏంటి? ఎంక్యూ-9 రేపర్ డ్రోన్లు భారత్ అంబుల పొదిలో చేరితే కలిగే ప్రయోజనాలు ఏంటి? ఒకసారి చూద్దాం..
☞ఎంక్యూ-9 రేపర్ డ్రోన్లను అమెరికాకు చెందిన ఆటమిక్స్ ఏరోనాటికల్ వ్యవస్థ అభివృద్ధి చేసింది. నింగి, నేల, నీరు ఎక్కడైనా సరే ఇవి పనిచేయగలవు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా, శత్రు దేశాల రహస్యాల సేకరణలో వీటిని ఉపయోగించవచ్చు. మానవ రహిత డ్రోన్లు కావడంతో కదన రంగంలో ఉపయోగించినా ప్రాణ నష్టం ఉండదు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లో ఇద్దరు పైలట్లు ఈ డ్రోన్ను నియంత్రిస్తారు. ఆటోమేటిక్ టేకాఫ్, ల్యాండింగ్, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సదుపాయాలు కలవు.
☞ ఈ ప్రిడేటర్ డ్రోన్లు 50 వేల అడుగుల ఎత్తులో 30-40 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలవు. 240 నాట్స్ ట్రూ ఎయిర్స్పీడ్ వేగంతో ఇవి ప్రయాణిస్తాయి.
☞ ఈ డ్రోన్లు ఫైటర్ జెట్లు చేసే పనులను కూడా చేస్తాయి. అంటే శత్రు లక్ష్యాలపై క్షిపణులతో, మందుగుండు సామగ్రితో దాడి చేయడం వంటికి చేయవచ్చు. ఈ సాయుధ డ్రోన్లకు 12,177 కిలోల బరువైన పేలోడ్ను, 114 హెల్ఫైర్ క్షిపణులు, జీబీయూ-12 పేవ్వే లేజర్ గైడెడ్ బాంబుల్ని మోసుకుపోయే సామర్థ్యం ఉంది.
☞ వీటికి నిఘా సామర్థ్యం కూడా ఉంది. అధునాతన కెమెరాలు, సెన్సర్లు, రాడర్లతో సరిహద్దుల వద్ద నిఘా పెట్టడం ద్వారా సెన్సిటివ్ అంశాలను అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి పంపగలవు.
☞ విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ముందస్తు చర్యల కోసం కూడా వీటిని ఉపయోగించవచ్చు. డ్రగ్స్ అక్రమ రవాణా, పైరసీ వంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో కూడా వినియోగించవచ్చు.
☞ సీ గార్డియన్ డ్రోన్లు సముద్ర నిఘా, డొమైన్ అవగాహనలోనూ పనిచేస్తాయి.
అగ్రరాజ్యం అమెరికా ఈ ఎంక్యూ-9 డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, నాసాలో అమెరికా ఈ డ్రోన్లను ఉపయోగిస్తుంది. అమెరికా తర్వాత అఫ్ఘానిస్థాన్, ఇరాక్, యూకే రాయల్ ఎయిర్ఫోర్స్, ఇటలీ ఎయిర్ఫోర్స్, ఫ్రెంచ్, స్పెయిన్ ఎయిర్ఫోర్స్, జపాన్ దేశాలు ఎంక్యూ-9 డ్రోన్లను వాడుతున్నాయి. ఇప్పుడు జోబైడెన్తో చర్చల అనంతరం భారత్ అంబులపొదిలోకి ఎంక్యూ-9 డ్రోన్లు వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది.
నింగి, నేల, నీటిలో పనిచేసే సామర్థ్యం ఉన్న ఈ డ్రోన్లను భారత త్రివిధ దళాల్లో ఎక్కడైనా వినియోగించవచ్చు. సముద్రపు నిఘా కోసం సీ గార్డియన్ డ్రోన్లు, భూ సరిహద్దు పరిరక్షణ కోసం స్కై గార్డియన్ డ్రోన్లను వాడొచ్చు. వీటిని ఉపయోగించడం ద్వారా భారత నిఘా, పర్యవేక్షణ సామర్థ్యం మరింత పెరుగుపడుతుంది. పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో తరచూ ఘర్షణలు, చొరబాట్లపై నిరంతర నిఘా ఉంచవచ్చు. సరిహద్దులో జరుగుతున్న అసాధారణ కదలికలకు సంబంధించి అత్యంత స్పష్టమైన ఫొటోలను అత్యంత వేగంగా పంపించడం ద్వారా శత్రు దేశాల ముప్పుల్ని ముందుగానే పసిగట్టవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యంపై నిఘా పెంచవచ్చు. సముద్రంలో నిఘా కోసం సీ గార్డియన్ డ్రోన్లను ఉపయోగించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో జరిగే స్మగ్లింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించవచ్చు. అక్కడ సహాయక చర్యల్లోనూ ఉపయోగింవచ్చు. తుఫాన్లు, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అక్కడ రక్షణ, సహాయక చర్యల్లోనూ వాడవచ్చు. మానవ రహిత రక్షణ సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేయవచ్చు.