భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి (Odisha trains accident) కారణం ఏమిటన్న దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి తప్పుగా వెళ్లడమే ప్రమాదానికి అసలు కారణమని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి ముందు కోరమాండల్ ఎక్స్ప్రెస్ తప్పుడు ట్రాక్లో ప్రయాణించినట్లు రైల్వే సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్ ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తున్నది. శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు బహానగర్ బజార్ స్టేషన్కు ముందు ఉన్న మెయిన్ లైన్కు బదులుగా లూప్ లైన్లో ఆ రైలు ప్రయాణించినట్లు రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కాగా, ఖరగ్పూర్ డివిజన్ సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్కు సంబంధించిన వీడియోల ప్రకారం మూడు రైళ్ల ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెండు ప్రధాన లైన్లు, రెండు లూప్ లైన్లతో సహా నాలుగు రైల్వే ట్రాక్లున్నట్లు తెలుస్తున్నది. గంటకు 127 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆ లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్నది. దాని కంపార్ట్మెంట్లు మెయిన్ లైన్పై పడ్డాయి. అయితే కొన్ని నిమిషాల్లోనే ఆ మెయిన్ లైన్లో వస్తున్న యశ్వంత్పూర్- హౌరా ఎక్స్ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది.
మరోవైపు సాధారణంగా లూప్ లైన్ 750 మీటర్ల పొడవు ఉంటాయి. గూడ్స్ రైళ్ల కోసం ఎక్కువగా లూప్ లైన్లు వినియోగిస్తారు. బహానగర్ బజార్ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలోని సిగ్నల్ ప్యానెల్ ప్రకారం అక్కడి లూప్ లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. అయితే గూడ్స్ రైలు చివరి బోగీలు మెయిన్ లైన్లో నిలిచి ఉండవచ్చని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో 127 కిలోమీటర్ల వేగంతో వచ్చిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆ గూడ్స్ రైలు బోగీలను ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు.
కాగా, మృతుల సంఖ్య సుమారు 300కు చేరిన మూడు రైళ్లు ఢీకొన్న ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపం వల్ల జరిగిందా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు తప్పుడు ట్రాక్లోకి వెళ్లడం మానవ తప్పిదమేనని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.