ముంబై: మహారాష్ట్రలోని సమృద్ది-మహామార్గ్ ఎక్స్ప్రెస్వేపై బుల్దానా సిటీ వద్ద ఇవాళ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం(Maharashtra Bus Accident)లో 25 మంది సజీవ దహనం అయ్యారు. ఈ విషాదకర సంఘటనకు చెందిన కొన్ని విషయాలు ఇప్పుడే తెలుస్తున్నాయి. ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున 1.35 నిమిషాలకు బుల్దానా సిటీ వద్ద బస్సు టైరు పేలినట్లు చెప్పాడు. ఆ వెంటనే బస్సు సడన్గా టర్న్ తీసుకున్నట్లు తెలిపాడు. ఆ ఓవర్టర్న్ వల్లే బస్సుకు చెందిన డీజిల్ ట్యాంక్ లీకైందని, దాని వల్ల భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు.
బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఇద్దరు డ్రైవర్లు, ఓ క్లీనర్ ఉన్నారు. అయితే దీంట్లో ఒక డ్రైవర్ మరణించాడు. క్లీనర్తో పాటు మరో డ్రైవర్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు.
డోరు ఉన్న సైడే బస్సు పడిపోవడం వల్ల.. దాని నుంచి జనం తప్పించుకోకపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో సజీవంగా ఉన్న వారు డ్రైవర్ సైడ్ వద్ద ఉన్న క్యాబిన్ సీటులో కూర్చున్నారు. వాళ్లు ముందు అద్దాలను పగులగొట్టి తప్పించుకున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ నిద్రలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి గురైంది విదర్భ ట్రావెల్స్కు చెందిన బస్సుగా గుర్తించారు. నాగపూర్ నుంచి పుణె వెళ్తుంటే ఈ ఘటన జరిగింది. మృతిచెందిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం షిండే. బుల్దానా జిల్లా శాఖ రెండు హెల్ప్లైన్ ( 7020435954, 07262242683)నెంబర్లను విడుదల చేశారు.