న్యూఢిల్లీ: పత్రికల్లో పతంజలి సంస్థ ప్రకటించిన క్షమాపణల యాడ్స్ గురించి ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశ్నలు వేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్, ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ పతంజలి సంస్థ గతంలో ఇచ్చిన యాడ్స్ విషయంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కోర్టు ఇటీవల ఆ కేసులో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ సారీ చెప్పారు. పత్రికల్లో క్షమాపణల యాడ్స్ కూడా ప్రచురించినట్లు వెల్లడించారు.
అయితే ఆ కేసులో ఇవాళ జస్టిస్ హిమా కోహ్లీ, ఆషానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. క్షమాపణలు చెబుతూ 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి సంస్థ కోర్టుకు తెలిపింది. అయితే ఆ క్షమాపణల యాడ్స్ ఏ సైజులో ఉన్నాయని జస్టిస్ కోహ్లీ ప్రశ్నించారు. పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన యాడ్స్ సైజులో.. క్షమాపణల యాడ్స్ ఉన్నాయా అని ఆమె అడిగారు. దానికి సీనియర్ అడ్వికేట్ బదులిస్తూ ఉత్పత్తులకు ఇచ్చిన యాడ్స్కు లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు.
క్షమాపణ యాడ్స్ సైజ్ను కొలిచేందుకు.. ప్రింట్ అయిన కాపీలను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. యాడ్స్ను కట్ చేసి, వాటిని మాకివ్వాలని, వాటిని పెద్దగా చేసి చూపవద్దు అని, ఆ యాడ్స్కు చెందిన అసలు సైజ్ను చూడాలనుకుంటున్నామని, ఇది మా ఆదేశమని, క్షమాపణ యాడ్స్ను ప్రచురించినప్పుడు, వాటిని భూతద్దం పెట్టి చూడవద్దు అని, పత్రికల్లో యాడ్స్ను చదివే రీతిలో ఉండాలని జస్టిస్ కోహ్లీ తెలిపారు.