కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ (Bayron Biswas) ఆ పార్టీని వీడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో సోమవారం చేరారు. ముర్షిదాబాద్ జిల్లాలో మైనారిటీల ప్రాబల్యం ఉన్న సాగర్దిఘి నియోజకవర్గానికి ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన బేరాన్ బిశ్వాస్ గెలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలువలేదు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు ఆయన ఉన్నారు.
కాగా, సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు కొత్తగా ప్రచార యాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా పశ్చిమ మెదినీపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో అధికార పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ టీఎంసీలో చేరారు. ఆ పార్టీ ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. తృణమూల్ కుటుంబంలోకి ఆయనను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. అలాగే విభజన, వివక్షపూరితమైన బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలన్న సంకల్పాన్ని బలోపేతం చేయడానికి సరైన వేదికను బేరాన్ బిశ్వాస్ ఎంచుకున్నట్లు తెలిపింది. ‘మనం కలిసికట్టుగా గెలుస్తాం’ అని ఆ ట్వీట్లో పేర్కొంది.
Today, during the ongoing #JonoSanjogYatra in the presence of Shri @abhishekaitc, INC MLA from Sagardighi Bayron Biswas joined us. We wholeheartedly welcome him to the Trinamool Congress family!
To strengthen your resolve to fight against the divisive and discriminatory… pic.twitter.com/CyCaUKTyRs
— All India Trinamool Congress (@AITCofficial) May 29, 2023