Ruchira Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుచిరా బెనర్జీని సోమవారం కోల్కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు చేరుకోగా.. వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. కొద్దిసేపటి వరకు అక్కడే ఉన్న రుచిరా బెనర్జీ చివరకు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. ఇమ్మిగ్రేషన్ అధికారులపై టీఎంసీ వర్గాలు విమర్శలు గుప్పించాయి. అయితే, బెంగాల్ కోల్ మైనింగ్ కేసును ఈడీ విచారిస్తున్నది. ఈ విషయంలో రుచిరా బెనర్జీని సైతం అధికారులు విచారించారు.
ఇటీవల ఆమెపై ఈడీ లుక్ ఔట్ నోటీసు జారీ చేసింది. లుక్ అవుట్ నోటీసు కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీ కోర్టులో కేసు విచారణ కొనసాగుతుందని, ఆ కేసులో రుచిరా బెనర్జీ ఇంకా బెయిల్ తీసుకోలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రస్తుతం దేశం నుంచి బయటకు వెళ్లనివ్వలేమని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేస్తున్నది. అందుకు సోమవారం విదేశాలకు వెళ్లకుండా నిలిపివేసినట్లు ఇమ్మిగ్రేషన్ శాఖ అధికారులు పేర్కొన్నారు. రుచిరా బెనర్జీని ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడంపై తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.