కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కరోనా నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకూ పొడిగించింది. ప్రస్తుత సడలింపులతో కొవిడ్-19 నియంత్రణలను సెప్టెంబర్ 30 వరకూ పొడిగించినట్టు బెంగాల్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మే 16న చేపట్టిన కరోనా నియంత్రణలను పలుమార్లు పొడిగించింది.
మాస్క్లు ధరిండం, భౌతిక దూరం పాటించడం, ఆరోగ్య, పారిశుద్ధ్య ప్రోటోకాల్స్ను విధిగా పాటించాలని స్పష్టం చేసింది. సగం మంది సిబ్బందితో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు పనిచేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇక నైట్ కర్ఫ్యూలో భాగంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఆరోగ్య సేవలు, శాంతి భద్రతలు, నిత్యావసర వస్తువులు, సేవలు మినహా అన్ని రకాల వాహనాల రాకపోకలనూ నిలిపివేస్తారు. కరోనా నిబంధనలు అందరూ పాటించేలా జిల్లా అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తారని పేర్కొంది.