మమతా బెనర్జీ… రాజకీయంగా ఎంత పేరు మోసారో… చిత్రకారిణిగా కూడా అంతే పేరు మోసింది. అనేక చిత్రాలు ఆమె కుంచె నుంచి జాలువారాయి. ఒత్తిడి అధికమైతే… బొమ్మలు గీసుకుంటానని మమత కొన్ని సార్లు చెప్పారు కూడా. బొమ్మ గీయడంతో పాటు మమతా బెనర్జీలో రచయిత కోణం కూడా ఉంది. ఆమె రాసిన 12 పుస్తకాలను కోల్కత్తా బుక్ ఫెయిర్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ప్రముఖ పబ్లిషర్ అపు దేవ్ వెల్లడించారు.
సీఎం మమత రాసిన 12 పుస్తకాలు బుక్ ఫెయిర్లోకి వచ్చాయని అందులో బెంగాల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ‘ఖేలాహోబే’ కూడా ఉందని ఆయన వెల్లడించారు. దీంతో పాటు కోవిడ్ సంక్షోభానికి సంబంధించి ‘కోవిడర్ డిన్లిపి’, ప్రజల వద్దే ప్రభుత్వం అన్న పుస్తకాలున్నాయి. ఈ పుస్తకంలో ప్రభుత్వ పథకాలు, ప్రజల స్పందనలు ఉన్నాయి. అయితే ‘ఖేలాహోబే’, ‘ప్రజల వద్దకే పాలన’ అన్న పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఇక అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో మమతా బెనర్జీ చేసిన ప్రసంగాలతో కూడిన పుస్తకం కూడా బుక్ ఫెయిర్లో ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. అదేవిధంగా బెంగాల్ ముఖ్యుల విషయంలో మమతా బెనర్జీ రాసిన కవితలతో కూడిన ‘లోహో ప్రణామ్ మోహియాషి చరణే చరణే’ అన్న పుస్తకం కూడా ఉంది. ఇందులో 50 కవితలున్నాయి. ‘కలమ్’ అన్న పుస్తకం (76 పేజీలతో ఉన్న కవితల పుస్తకం), 950 పేజీలతో వున్న (కవితా బిటన్) అనే పుస్తకం కూడా ఉంది.