న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: సుప్రీంకోర్టులో వాదించిన దేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చరిత్ర సృష్టించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)లో జోక్యం చేసుకోవాలని ఆమె సుప్రీంకోర్టును బుధవారం అర్థించారు. పశ్చిమ బెంగాల్ను కేంద్రం లక్ష్యంగా చేసుకుందని, రాష్ట్ర ప్రజలను అణచివేస్తున్నదని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోర్టును అర్థించారు. మమత పిటిషన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అసలైన ఓటర్లు ఓటర్ల జాబితాలో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
మమత పిటిషన్పై ఫిబ్రవరి 9లోగా సమాధానం ఇవ్వాలని భారత ఎన్నికల కమిషన్, పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి నోటీసులు జారీచేసింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో తృణమూల్ నేత, న్యాయవాది కల్యాణ్ బెనర్జీతోసహా తన న్యాయవాదులను వెంటపెట్టుకుని మమత సుప్రీంకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. మమత వాదనలను కళ్లారా చూసేందుకు పెద్దసంఖ్యలో న్యాయవాదులు, కక్షిదారులు సీజేఐ కోర్టు హాలు వద్ద గుమికూడారు. ఐదు నిమిషాలు వాదించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని మమత సీజేఐని కోరారు. 5 కాదు 15 నిమిషాల సమయం ఇస్తామని సీజేఐ బదులిచ్చారు.
మమత తన వాదన ప్రారంభిస్తూ, మా న్యాయవాదులు మొదటి నుంచి దీనిపై పోరాడుతున్నారు. అంతా పూర్తయిపోయిందని అనుకున్నప్పటికీ మాకు న్యాయం మాత్రం లభించడం లేదు. మాకు ఎక్కడా న్యాయం లభించడం లేదు. నేను నా పార్టీ కోసం పోరాడడం లేదు. పశ్చిమ బెంగాల్ను లక్ష్యంగా చేసుకున్నారు అని ఆరోపించారు. ఇదే కొలమానాన్ని అస్సాంకు ఎందుకు వర్తింపచేయడం లేదని ఆమె ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలను అణచివేసేందుకు తమ రాష్ర్టాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె వాదించారు. సర్ ఇబ్బందులపై ఈసీకి ఆరు లేఖలు రాశానని, కాని అక్కడి నుంచి సమాధానం లేదని మమత తెలిపారు.