కోల్కతా: ఉత్తరాఖండ్లో ఎమ్మెల్యేగా ఎన్నికకాలేక తీరథ్సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకోవడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మేల్కొన్నారు. రేపు తనకూ అదే పరిస్థితి ఎదురుకాకుండా ఉండటం కోసం రాష్ట్రంలో కొత్తగా శాసన మండలిని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేకపోయినా మండలిలో ఎమ్మెల్సీ పదవి చేపట్టి ముఖ్యమంత్రి పదవికి ఢోకా లేకుండా చూసుకోవచ్చని ఆమె భావిస్తున్నారు. అ మేరకు ఇవాళ బెంగాల్లో శాసన మండలి ఏర్పాటుపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు.
బీజేపీ అధిష్ఠానం గత మార్చిలో అప్పటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ను తొలగించి ఆయన స్థానంలో తీరథ్సింగ్ రావత్ను నియమించింది. అయితే, ఆరు నెలల్లోపు అంటే సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహణకు విముఖత చూపింది. దాంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు.
ఈ నేపథ్యంలో మమతాబెనర్జి ముందే మేల్కొన్నారు. తీరథ్సింగ్ రావత్కు ఎదురైన పరిస్థితే తనకు కూడా ఎదురవకుండా ఉండటం కోసం రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. మొత్తం 294 మంది ఎమ్మెల్యేలున్న సభలో 196 మంది తీర్మానానికి అనుకూలంగా.. మరో 69 మంది ఎమ్మెల్యేలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉన్నది.