West Bengal : పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే యూపీ సీఎం యోగి మోడల్ను అమలు చేస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు బుల్డోజర్లను రంగంలోకి దింపింది. సిలిగురిలోని అక్రమ నిర్మాణాల్ని బుల్డోజర్లతో కూల్చేస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా కూడా ఈ చర్యను సమర్ధించారు.
అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం రెండు డజన్ల బుల్డోజర్లను యూపీ ప్రభుత్వం నుంచి బెంగాల్ ప్రభుత్వం తెప్పిస్తోందని ఆయన వెల్లడించారు. అక్రమ నిర్మాణాల అంశంపై గురువారం సిలిగురిలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్, ఎస్పీ, ఇతర జిల్లాస్థాయి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడం, అక్రమ నిర్మాణాల్ని తొలగించడం, డ్రగ్స్ను అరికట్టడం, అక్రమ మద్యం, బార్ షాపులను తొలగించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం రాజు బిస్తా మాట్లాడుతూ, సిలిగురిలో అక్రమ నిర్మాణాలు భారీ స్థాయిలో వెలిశాయని, వాటిని వదిలేసేది లేదన్నారు.
వీటిని కూల్చేందుకు యూపీ నుంచి బోల్డోజర్లు తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమ నిర్మాణాల విషయంలో సిలిగురి మున్సిపాలిటీ పాలకులు, అధికారులు విఫలమయ్యారని ఎంపీ విమర్శించారు. ఈ విషయంలో వారి నుంచి త్వరలోనే వివరణ కోరనున్నట్లు తెలిపారు. సిలిగురిలోని ప్రభుత్వ స్తలాలు, చెరువులు, ఇతర జలవనరులు వంటి చోట కబ్జాల్ని పూర్తిగా తొలగిస్తామన్నారు.