ముంబై: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజూ లక్షల మంది కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. మహారాష్ట్రలో అయితే వైరస్ తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో మహమ్మారి నిర్మూలన కోసం ముంబై పాలక యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే నగర ప్రజలకు వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.
ప్రపంచంలో వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచిన మొదటి మున్సిపల్ కార్పొరేషన్ తమదేనని ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ చెప్పారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. వర్క్ ఆర్డర్ పూర్తయిన తర్వాత మూడు వారాల్లోగా తమకు వ్యాక్సిన్లు డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఐసీఎమ్మార్, డీసీజీఐ మార్గదర్శకాలకు లోబడి వ్యాక్సిన్లను డెలివరీ చేయాల్సి ఉంటుందన్నారు.