చండీగఢ్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్నది. ఇవాళ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ చండీగఢ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేజ్రివాల్.. పంజాబ్లో ఆప్ అధికారంలోకి వస్తే అవినీతిని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం చండీగఢ్లోని మున్సిపాలిటీల్లో ఏదైనా పని కావాలంటే ప్రజలు లంచాలు ఇవ్వాల్సి వస్తున్నదని, భారీ క్యూలైన్ల కారణంగా ఆఫీసులకు సెలవులుపెట్టి మరీ పనులు చూసుకోవాల్సి వస్తున్నదని గుర్తుచేశారు.
ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో మాదిరిగా మున్సిపాలిటీ అధికారులే మీ ఇండ్లకు వచ్చి పనిచేసి పెడుతారని కేజ్రివాల్ స్పష్టంచేశారు. అంతేగాక ఢిల్లీలో లాగా చండీగఢ్లో కూడా తాగునీటిని పూర్తిగా ఉచితంగా అందజేస్తామన్నారు. పాలకుల నిర్లక్ష్యంవల్ల చండీగఢ్లో కొన్ని ప్రాంతాలు చెత్తకుండీలుగా మారాయని ఆరోపించారు. తాము గెలిస్తే దద్దూ మజ్రా కాలనీలో లాంటి చెత్త గుట్టలను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. చండీగఢ్ సిటీని ఆసియా ఖండంలోనే అత్యంత అందమైన నగరంగా తీర్చిదిద్దుతామని కేజ్రివాల్ ప్రకటించారు.