చండీగఢ్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో.. పంజాబ్లో ప్రస్తుతం అదే జరుగుతున్నదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. లూథియానా జిల్లా కోర్టులో గురువారం ఉదయం జరిగిన పేలుడు బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం సిద్ధూ మీడియాతో మాట్లాడారు. పంజాబ్లో ఇటీవల వరుసగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలను ప్రస్తావించారు. దాదాపు నాలుగేండ్లు అంతా బాగానే ఉంటే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాత్రమే సంఘటనల పరంపర ఎందుకు జరుగుతోంది? అని ప్రశ్నించారు. బెంగాల్లో కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు.
రాజకీయ ఎజెండా పేరుతో భయాన్ని వ్యాప్తి చేయడం దురదృష్టకరమని సిద్ధూ అన్నారు. ప్రతికూల రాజకీయాలకు ఇది పరాకాష్ట అని విమర్శించారు. ఓట్ల కోసం అమాయకులను చంపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. సిక్కులను విభజించాలనుకునే వారికి తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.