న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిది. కొన్ని ఆంక్షలను కూడా ఎత్తివేయనున్నారు. మార్కెట్లు, మాల్స్, దుకాణాలకు సరి – బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
50 శాతం ఉద్యోగులతోనే ప్రయివేటు కార్యాలయాల నిర్వహణకు అనుమతి ఇవ్వనున్నారు. గతంలో అన్ని ప్రయివేటు కార్యాలయాలు మూసివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్కు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీలో గురువారం నాడు కొత్తగా 12,306 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం రోజు మాత్రం 13,785 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజురోజుకు కరోనా తీవ్రత తగ్గుతుందన్నారు. ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య కూడా తగ్గిందన్నారు.