న్యూఢిల్లీ : ఇటీవల కురిసిన వర్షాలకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండవేడి నుంచి జనం ఉపశమనం పొందారు. వర్షాలు తగ్గుముఖం పడడంతో మళ్లీ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వేడిగాలుల కారణంగా జనం అల్లాడుతున్నారు. శనివారం దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచికొట్టాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో వైపు పలు రాష్ట్రాల్లో భారీగా వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నెల 11 వరకు విదర్భలోని వివిధ ప్రాంతాల్లో, ఈ నెల 8-11 మధ్య పశ్చిమ రాజస్థాన్లో, 9-11 మధ్య దక్షిణ హర్యానా, తూర్పు రాజస్థాన్ మీదుగా వేడిగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఆది, సోమవారాల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, 10, 11 తేదీల్లో దక్షిణ పంజాబ్, జమ్మూ డివిజన్లలో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మరో వైపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా.. చురుగ్గా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బాంగోప్ సాగర్పై చురుగ్గా ఉందని, మరికొద్ది గంటల్లో మరింత చురుగ్గా మారుతుందని, ఆదివారం సాయంత్రం వరకు తుఫానుగా మారుతుందని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో ఒడిశా, అండమాన్లో వర్షాలు కురుస్తున్నాయి.
అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 10న కోస్తా ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో వైపు తెలంగాణలో రానున్న మూడు నాలుగు రోజుల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని.. ఆ తర్వాత రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.