Snowfall | జమ్మూ కశ్మీర్, హిమాచల్ప్రదేశ్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తున్నది. దీంతో పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతంలో చలి తీవత్ర పెరిగింది. కశ్మీర్లోని కిష్త్వార్లోని సింథాన్లో దట్టంగా మంచు కురుస్తున్నది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా సింథాన్ టాప్ మీదుగా వెళ్లే కిష్త్వార్-అనంతనాగ్ రహదారిని మూసివేశారు. శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్ 3 డిగ్రీలకు పడిపోయాయి. అనంతనాగ్లో ఉష్ణోగ్రత 0.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. జమ్మూ కశ్మీర్లో చలికి ఇప్పటికే ప్రముఖ దాల్ సరస్సుతో పాటు నదుల్లో నీరు గడ్డకట్టింది.
హిమాచల్ప్రదేశ్లోని అటల్ టన్నెల్ రెండు చివరలను మంచు కప్పేసింది. దీంతో వాహనాల రాకపోకలకు అటల్ టన్నెల్ను మూసివేశారు. కులు, లాహౌల్, స్పితి, చంబా ప్రాంతాల్లో హిమపాతం కురిసింది. రోహ్తంగ్ పాస్తో పాటు, సిస్సు, బరాలాచా, కుంజమ్ పాస్, కోక్సర్తో సహా పలు ప్రాంతాల్లో దట్టంగా హిమపాతం కురుస్తున్నది. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావంతో గత 24 గంటల్లో రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మరో వైపు రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు పడిపోయాయి. సికార్ జిల్లాలోని ఫతేపూర్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. హర్యానాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.
ఆదివారం కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పెరుగుతున్న చలిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ పాఠశాలలకు జనవరి ఒకటి నుంచి 15 వరకు శీతాకాల సెలవులను ప్రకటించింది. ఒడిశాలోని పూరీ, గంజాం, కలహండి, కోరాపట్ సహా 14 జిల్లాల్లో ఆదివారం కూడా పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రత సాహు కోరారు. రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరిగింది. జీ ఉదయగిరి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 5.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.