ముంబై, నవంబర్ 28: ఆధార్ కార్డు లేకుంటే బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకూడదని మహారాష్ట్రలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. యూనిఫాం వంటి ఇతర సదుపాయాలు కూడా కట్ చేస్తామని పేర్కొంటూ ఏక్నాథ్ షిండే సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త నిబంధన వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నది. ఈ కొత్త రూల్ లక్షలాది విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. దాదాపు 59 లక్షల మంది చిన్నారులకు ఆధార్ లేకపోవడమో లేదా ఉన్నా వివరాలు తప్పుగా ఉండటమో తదితర సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డాటా ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ బడులు, ఎయిడెడ్ పాఠశాలల్లో 2,33,13,762 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. వీరిలో 19,55,515(8 శాతం) మంది పిల్లలకు అసలు ఆధార్ కార్డులే లేవు. 40,01,250(18%) విద్యార్థులకు వాలిడ్ ఆధార్ కార్డులు(పేరు, పుట్టిన తేదీ, వంటివి తప్పు ఉండటం) లేవు.
టీచర్ల రిక్రూట్మెంట్పైనా ప్రభావం
బడిలో అడ్మిషన్కు ఆధార్ తప్పనిసరి కాదని, అయితే భోజనం వంటి ఇతర సదుపాయాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులందరూ డిసెంబర్ 20లోగా ఆధార్ కార్డు పొందేలా చర్యలు తీసుకోవాలని టీచర్లకు డెడ్లైన్ పెట్టినట్టు ఓ అధికారి పేర్కొన్నారు. ఆధార్ తప్పనిసరితో ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. సాధారణంగా నమోదు చేసుకొన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయుల పోస్టులు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో తాజా నిబంధన ఉపాధ్యాయ రిక్రూట్మెంట్పై ప్రభావం చూపుతుందని అంటున్నారు.