లక్నో: వివిధ ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ను తెస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. ఉద్యోగాలు ఎలా కల్పిస్తామో అన్నది యువతకు చెబుతామని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నోయిడాలోని వివిధ బృందాలతో ఆమె మాట్లాడారు. యూపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ను తెస్తామని చెప్పారు.
అధికారంలోకి రాగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ రాజకీయ పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయని ప్రియాంక గాంధీ అన్నారు. అయితే ఎలా చేస్తారో అన్నది చెప్పరంటూ విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం దీనిపై చాలా స్పష్టతతో ఉందన్నారు. అందుకే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనపై హామీ ఇస్తున్నట్లు తెలిపారు.
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగనున్నాయి. ఈసారి నాలుగు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. యూపీలోని అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతోపాటు కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.