న్యూఢిల్లీ: పెగాసస్ స్నూపింగ్ ఆరోపణలు నిజమన్న సంగతి బయటపడిందని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన చెప్పారు. దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అన్నది విపక్ష పార్టీలతో చర్చిస్తామని చెప్పారు. పలు రంగాలకు చెందిన కొందరి మొబైల్ ఫోన్లపై పెగాసస్ స్పైవేర్తో కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు గత ఏడాది ది వైర్ సంచలన కథనాలు ప్రచురించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ సమావేశాలు సజావుగా సాగలేదు. అయితే ఇజ్రాయెల్, భారత్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందంలో పెగాసస్ స్పైవేర్ కేంద్రంగా ఉందని న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఒక నివేదిక ప్రచురించింది. దీంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
కాగా, పెగాసస్ అంశం వల్ల వర్షాకాల సమావేశాలు ప్రభావితమయ్యాయని మల్లిఖార్జున్ ఖర్గే గుర్తు చేశారు. అయితే పార్లమెంట్ని నిర్వహించడానికి ప్రతిపక్షాలు అనుమతించడం లేదని పాలక పక్షం చెప్పిందన్నారు. కానీ నిజం మరోసారి బయటకు వచ్చిందని తెలిపారు. దీంతో బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తుతామని అన్నారు. అలాగే ఇప్పటికే ఉన్న పాత, కొత్త సమస్యలతోపాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళలు-దళితులపై నేరాలు వంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు సభలో లేవనెత్తుతామని చెప్పారు.