బెంగళూరు: ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హెచ్చరించారు. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు పోటీపడి ఛత్రపతి శివాజీ మహరాజ్, సంగొల్లి రాయన్న విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. బాధ్యత కలిగిన పౌరులెవరూ ఇతరులను రెచ్చగొట్టే పనులు చేయరని వ్యాఖ్యానించారు.
ఛత్రపతి శివాజీ మహరాజ్, సంగొల్లి రాయన్న, రాణీ చెన్నమ్మ దేశాన్ని ఐక్యం చేశారని సీఎం బొమ్మై గుర్తుచేశారు. ఇప్పుడు వాళ్ల పేర్లు చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడం.. నాడు వాళ్లు చేసిన పోరాటానికి అన్యాయం చేయడమేనని చెప్పారు. ఒకరినొకరు రెచ్చగొట్టుకుని హింసాత్మక ఘటనలకు పాల్పడటం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లాంటివి చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.