కోల్కతా: కేంద్రంలో నియంతృత్వ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారని, వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి ఒక కుటుంబంలా బీజేపీపై పోరాడి ఓడిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ముఖ్యమంత్రి మమతాబెనర్జి అన్నారు. ఇవాళ పట్నాలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్లిన మమతా బెనర్జి.. లాలూని, ఆయన సతీమణి, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని.. లాలూ తనయుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ను కలిసి మాట్లాడారు.
లాలూ కాళ్లకు నమస్కరించి సోఫాలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా మమతాబెనర్జితోపాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జి కూడా ఉన్నారు. రేపు విపక్ష పార్టీలన్నీ సమావేశం కానున్న నేపథ్యంలో ఇవాళ జరిగిన వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. లాలూ కుటుంబంతో మీటింగ్ అనంతరం మాట్లాడిన మమతాబెనర్జి.. బీజేపీని ఓడించి తీరుతామన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ అంటే తనకు చాలా గౌరవమని చెప్పారు. లాలూజీని, ఆయన సతీమణిని, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని మమత పేర్కొన్నారు. లాలూజీ చాలా సీనియర్ నాయకుడని, గత కొన్నేళ్లుగా ఆయన జైలు, ఆస్పత్రిలోనే ఎక్కువ రోజులు గడిపారని విచారం వ్యక్తంచేశారు. లాలూజీ ఇప్పటికీ ఫిట్గానే ఉన్నారని, బీజేపీతో పోరాడే సత్తా ఆయనలో ఉన్నదని మమత చెప్పారు.