న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలుగా ఉన్నాయని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తాము ఆ అంశాలనే ప్రధానంగా లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇవాళ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో దేశం ఆర్థికంగా వెనుకబడిందని విమర్శించారు.
ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం విషయంలో కూడా కేంద్రం తన అసమర్థతను చాటుకుందని మండిపడ్డారు. ఈ విషయాన్ని కూడా తాము పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. ప్రభుత్వ బ్యాంకులు బడా వ్యాపారవేత్తలకు వేల కోట్ల లోన్లు కట్టబెట్టడంపై కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగాన్ని వినాలనుకున్నామని, కానీ ప్రతికూల వాతావరణం కారణంగా శ్రీనగర్ పనుంచి వచ్చే సరికి ఆలస్యమైందని చెప్పారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమం కోసం ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు శ్రీనగర్ వెళ్లారు. ఇవాళ బ్యాడ్ వెదర్ వల్ల ఉదయం 11 గంటలకల్లా పార్లమెంటుకు చేరుకోలేకపోయారు.