న్యూఢిల్లీ: ప్రజా సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ( Rahul Gandhi ) ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు, ధరల పెంపు, పెగాసస్ తదితర అంశాలపై చర్చకు తాము ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదని రాహుల్గాంధీ విమర్శించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము ఇవాళ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రైతులతో కలిసి ఆందోళన చేస్తున్నామని ఆయన తెలిపారు.
అదేవిధంగా పెగాసస్ అంశంపై కూడా పార్లమెంటులో చర్చ జరుగాల్సిందేనని రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ప్రతి భారతీయుడి ఫోన్లో చొరబడ్డాడని ఆయన విమర్శించారు. కాగా, ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తిప్పికొట్టారు. రైతుల గురించి ప్రభుత్వానికి నిజంగా ఆందోళన ఉంటే.. రైతు సమస్యలపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చకు తాము సిద్ధమని తోమర్ చెప్పారు.
ప్రతిపక్షాలే రైతుల సమస్యలపై చర్చకు సుముఖంగా లేవని ఆయన విమర్శించారు. వాళ్లు కేవలం మీడియాలో కనిపించాలనే తపనతోనే మాటిమాటి వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.