PM Modi : భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓ ఆదివాసీ మహిళకు తమ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ను రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ (NDA) అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. మొదట్లో ఆ పదవికి ముర్ము పేరును ప్రతిపాదించగానే.. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish kumar) పిలుపునిచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు.
పీఎం జన్మన్ యోజన (PM Janman Yojana) పథకం ద్వారా పనులను ప్రారంభించిన ఘనత ద్రౌపది ముర్ముదేనని ఆయన కొనియాడారు. ఆదివాసీల కష్టాలను తీర్చేందుకు ఈ పథకం ద్వారా రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. బీహార్ (Bihar) లో నిర్వహించిన ఓ సభలో ప్రసంగించిన ప్రధాని.. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు వెనకబడిన వర్గాల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, వారి అభివృద్ధికి కృషి చేయలేదని ప్రధాని విమర్శించారు.
సమాజానికి దూరంగా నివసిస్తున్న ఆదివాసీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆదివాసీలు పండించే దాదాపు 90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (MSP) ఇచ్చామని అన్నారు. ఆదివాసీ యువత క్రీడల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని, వారిని మరింత ప్రోత్సహించడానికి అనేక క్రీడా సౌకర్యాలను ప్రారంభిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఆదీవాసీలకు చదువు, సంపద, వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
ఆదివాసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని, బడ్జెట్ను రూ.25 వేల కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు పెంచామని ప్రధాని తెలియజేశారు.