న్యూఢిల్లీ: తాము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)గా గురువారం బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్ సక్సేనాను శుక్రవారం కలిసి ఆయనతో సమావేశమయ్యారు. ఢిల్లీ ప్రజల కోసం తామిద్దరం కలిసి పని చేయాలని నిర్ణయించామని అనంతరం మీడియాతో కేజ్రీవాల్ అన్నారు. ‘మా మొదటి సమావేశం ఇప్పుడే జరిగింది. ఆయన సానుకూలంగా కనిపిస్తున్నారు. మేం అనేక అంశాలపై చర్చించాం. ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పారు.
లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కూడా ఢిల్లీ సీఎంతో జరిగిన భేటీపై ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై తామిద్దరం చర్చించుకున్నామని అందులో పేర్కొన్నారు. కాగా, వ్యక్తిగత కారణాలతో ఎల్జీ అనిల్ బైజల్ రాజీనామా నేపథ్యంలో ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ఈ నెల 23న నియమితులయ్యారు.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఎల్జీ అనిల్ బైజల్, ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనానికి ప్రయత్నించారు. దీంతో అధికార పరిధుల వివాదం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య సమన్వయం, సహకారం ఎలా ఉంటాయో అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది.
Delhi| New LG has taken his posting. Our first meeting was just held. He seems positive. We discussed several issues & decided to work together for the betterment of the people of Delhi: CM Arvind Kejriwal after meeting with Delhi LG Vinai Saxena pic.twitter.com/Q92gnopYHv
— ANI (@ANI) May 27, 2022
Hon'ble Chief Minister Shri @ArvindKejriwal ji called on today.
We discussed various issues pertaining to the development of Delhi and the welfare of its people. pic.twitter.com/j5eDtFFNRO— LG Delhi (@LtGovDelhi) May 27, 2022